01/04/2012

శ్రీ సీతారామ కళ్యాణం


సభంతా కిక్కిరిసి ఉంది.
రాజాధిరాజులు, చక్రవర్తులు, సామంతులు
తమతమ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించి
శివుని విల్లు ఎక్కుబెట్టి 
'సీత'ను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు.


ఒక్కక్కరే  ప్రయత్నించి  అవమానభారంతో
వెనుదిరుగుతున్నారు.
జనకుని మనసులో ఆందోళన.
మిథిలాధీశుని పట్టపురాణి ముఖములో 
నిరాశ,నిస్పృహలు అలుముకున్నాయి ....

మైథిలి క్రీగంట శ్రీ రాముని చూసింది.
పురుషులకి సైతం మోహనంగా కనిపించే 
ఆ రూపాన్ని మనసులో చిత్రించుకుంది.
రాముని చూపు సీతపై పడింది...
చూపులు కలిసాయి...
రాముని తనువు విద్యుద్ధనువైతే
సీత మేను సిగ్గుల హరివిల్లే అయింది.

విశ్వామిత్రుని ఆజ్ఞ అయింది
శివధనస్సుని సమీపించాడు రాముడు.
క్షణం  క్రితం చూసిన సీత బరువైన  పూలజడ మదిలో మెదిలింది.
ఈ విల్లునే  ఎ త్తలేకుంటే రేపు ఆ జడనెలా ఎత్తగలను? అనుకున్నాడు.

అలవోకగా శివధనువునెక్కుబెట్టాడు
ఆ ధనుష్టంకారానికి పృథ్వి దద్దరిల్లింది 
ఫెళ్ళున పిడుగుపాటు ధ్వనితో విల్లు విరిగింది.
సీత పెదవిపై చిరునవ్వు విరిసింది

మిథిలలో సంబరాలు అంబరాన్నంటాయి
సీతమ్మ పెల్లికూతురయ్యింది.
సీతారాములు కళ్యాణమాలలు మార్చుకున్నారు,
ముత్యాల తలంబ్రాలు పోసుకున్నారు.
దేవపారిజాతాల   పుష్పవృష్టిలో  సీతారాములు పరిమళభరితులయ్యారు

శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం,
అది లోక కళ్యాణం, జగత్కళ్యాణం,
ఈ విశ్వానికే  నిత్యకళ్యాణం-పచ్చతోరణం.


                                                                                         @శ్రీ 

(అందరికీ ' శ్రీరామనవమి'  శుభాకాంక్షలతో...)